హుజూరాబాద్, ఆగస్టు 16: దళితవాడకు పండుగొచ్చింది. దళితలోకం మురిసింది. విప్లవాత్మక .. దళితజీవితాల్లో వెలుగులు నింపే మహత్తర పథకానికి పునాది పడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఊరూరా ఆడబిడ్డ సంబురపడగా, ఇంటింటా సందడి కనిపించింది. ఇంటిల్లిపాది ఉదయాన్నే లేచి.. తమ ఊళ్లూ.. కాలనీలే కాదు తమ ఇండ్లనూ అందంగా అలంకరించుకున్నది. గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించుకోవడంతోపాటు వాకిళ్లలో అందమైన రంగులు వేసి పథకానికి స్వాగతం పలుకుతూనే.. సీఎం కేసీఆర్కు వినూత్నంగా కృతజ్ఞతలు చాటింది. దళిత బాంధవుడు.. ఆత్మబంధువు కేసీఆర్ అంటూ కీర్తించింది. కొత్త బట్టలు ధరించి, ఇంట్లో దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం సభకు వెళ్లేందుకు పిల్లాజెల్లాను సిద్ధం చేశారు. ఎన్ని పనులున్నా వదులుకొని అంతా కలిసి సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లారు. దళిత బాంధవుడు.. ఆత్మబంధువు కేసీఆరే మా దేవుడు అంటూ కీర్తించారు. ఇక తమ జీవితాలు బాగుపడ్డట్టే అని, ఇది నిజంగా పండుగరోజే అంటూ ఒకరికికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కనిపించారు.