మిర్యాలగూడ టౌన్, మే 6: పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొన్న ఓ జీవిత ఖైదీని కారు ఫాస్ట్ట్యాగ్ పట్టించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం కోర్టు నుంచి తప్పించుకున్న ఖైదీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా వాడపల్లి పరిధిలో ఓ కేసులో నిందితుడిగా ఉండి మరో కేసులో చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా ఉన్న రవిశంకర్ను విచారణ నిమిత్తం ఈ నెల 5న మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. చర్లపల్లి జైలులో తనతోపాటు ఉన్న ఓ ఖైదీకి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించిన రవిశంకర్.. అతని బంధువులను కోర్టుకు రప్పించాడు. మాట్లాడుతున్నట్టు నమ్మించి వారి కారులోనే బేడీలతో సహా పరారయ్యాడు.
ఎస్కార్ట్ పోలీసుల ఫిర్యాదుతో అప్రమత్తమైన మిర్యాలగూడ వన్టౌన్ ఎస్సై సుధీర్కుమార్ బృందం రంగంలోకి దిగి 5 గంటల వ్యవధిలో ఆచూకీ తెలుసుకొన్నారు. ఖైదీ లొకేషన్ ఏపీలోని పాత గుంటూరు జిల్లా గురజాల వద్ద ఆగిపోయింది. వెంటనే పిడుగురాళ్ల, తుమ్మలపల్లి, విజయవాడ సహా ఇతర టోల్ప్లాజాలను పోలీసులు అప్రమత్తం చేశారు. కారు ఫాస్ట్ట్యాగ్కు రీచార్జ్ కూడా చేయించారు. ఈ క్రమంలో కారు టంగుటూరు టోల్ప్లాజాను దాటినట్టు మెసేజ్ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు హైవే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు గురువారం అర్ధరాత్రి టంగుటూరు టోల్ప్లాజా సమీపంలో ఖైదీని అదుపులోకి తీసుకొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఖైదీని పట్టుకున్న పోలీసులను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు అభినందించారు.