నిర్మల్ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసిస్తూ ధర్నా చేపట్టామన్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని తెలిపారు.
ఓ వైపు వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు.