గంగాధర, ఆగస్టు 31: బర్రెను తోలుకురావడానికి వెళ్లిన ఓ రైతు బురదలో కూరుకుపోయి మృత్యువాతపడిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాచిరెడ్డిపల్లికి చెందిన రైతు సరిపెల్లి నర్సయ్య (60) సోమవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసిన బర్రెను తోలుకురావడానికి వెళ్లాడు.
ఒడ్డుపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పొలంలో పడిపోయాడు. తల బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ దవాఖానకు తరలించారు.