హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ప్రొటోకాల్ అధికారిగా పనిచేస్తున్నానని నమ్మించి అమాయకులను వంచిస్తున్న ఘరానా మోసగాడు బసి ప్రవీణ్ సాయి.. బీటెక్ చదువుతున్నప్పటి నుంచే మోసాలు చేయడంలో ఆరితేరినట్టు పోలీసులు తెలిపారు.
శనివారం ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడిన అతనిపై ఇప్పటికే కూకట్పల్లి, సైఫాబాద్, ఏసీబీ, బేగంపేట, అంబర్పేట ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో బేగంపేట పోలీసులు పీటీ వారెంట్పై అతడిని అరెస్టు చేసి, పీడీ యాక్టు పెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్న ప్రవీణ్ సాయి గతంలో ఓ ఎమ్మెల్యే పీఏ ద్వారా బీటెక్ సీటు సంపాదించాడు.
ఆ తర్వాత అతని ద్వారా మరికొంత మంది ఎమ్మెల్యేల పీఏలను పరిచయం చేసుకున్నాడు. వారి సాయంతో ఆయా ఎమ్మెల్యేలను కలిసి తనను ఓ గొప్ప వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ఎమ్మెల్యేల నుంచి పైరవీలు వస్తాయన్న ఆశతో తాను సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్టు చెప్పి హంగు, ఆర్భాటాలను ప్రదర్శించేవాడు. అందులో భాగంగా ఇన్నోవా కారుకు నకిలీ వీఐపీ నంబర్ ప్లేట్ను, ఎమ్మెల్యే స్టిక్కర్లను తగలించుకుని బిల్డప్ ఇచ్చేవాడు.
వీటితోపాటు నకిలీ లెటర్లు, ఐడీ కార్డులు తయారు చేసుకుని ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, అసైన్డ్ స్థలాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించేవాడు. తన మోసాలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వాకీ-టాకీలు ఉపయోగించేవాడు. సికింద్రాబాద్కు చెందిన సునీత్ అనే వ్యాపారితో దోస్తీ మొదలుపెట్టి అతని నుంచి వాకీ-టాకీలు కొనుగోలు చేసిన ప్రవీణ్ సాయి.. గతంలో కొంత మంది ఎమ్మెల్యేల పీఏలను మోసగించినట్టు తెలుస్తున్నది.