పీఏ పల్లి మండలం అజ్మాపురంలో ఆశ్రమం ఏర్పాటు
మహిళ ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం
బాబా మోసాలపై కొనసాగుతున్న విచారణ
నీలగిరి/ పీఏపల్లి, ఆగస్టు 1 : ఆయనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. సులభంగా డబ్బు సంపాదించాలని రాత్రికి రాత్రే బాబాగా మారాడు. భక్తులను ఆకర్షించేందుకు ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసుకున్నాడు. పలు రోగాలు, మానసిక సమస్యలకు హోమాలు, యజ్ఞాలు చేస్తూ తాయత్తు ఇస్తూ ప్రచారంలోకి వచ్చాడు. ఏడాది కాలంలోనే బాబా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండగా ఓ మహిళ ఫిర్యాదుతో వ్యవహరం పూర్తిగా బెడిసి కొట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వచైతన్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవాడు. సాఫ్ట్వేర్ కంపెనీ, వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బారిన పడ్డాడు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం తన మకాం హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం మార్చాడు. అక్కడ 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి హైటెక్ హంగులతో సాయిబాబా పేరిట ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రమంలో సాయిబాబా ప్రవచనాలు, హోమాలు చేసేవాడు. దీర్ఘకాలిక రోగాలు, సంతానం లేని వారి తోపాటు వివిధ రకాల సమస్యలతో బాధపడేవారిని ఆకర్షించసాగాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సాయి విశ్వచైతన్య పేరుతో యూట్యూబ్ చానెల్ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా భక్తులను ఆకర్షించి రోగాలు నయం చేస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయ సాగాడు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు హోమాల పేరుతో పంగనామాలు పెడుతున్న నకిలీబాబా చేతిలో మోస పోయిన ఓ మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. దీంతో శనివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆశ్రమంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాబా లీలలకు సంబంధించిన విచారణ చేపట్టారు.
ప్రజలను సులభంగా మోసం చేసేందుకు నకిలీ బాబా సాయి విశ్వచైతన్య యూట్యూబ్ చానెల్ను ఏర్పాటు చేశాడు. ఈ చానెల్లో ప్రవచనాలు నిర్వహిస్తూ 7 లక్షల మంది భక్తులను సంపాదించాడు. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హోమం చేస్తానని లక్షల రూపాయలు వసూలు చేయసాగాడు మానసికంగా ఇబ్బంది పడేవారికి తాయత్తులు ఇస్తూ వారినుంచి అందిన కాడికి దండుకునేవాడు. అంతేకాకుండా యూట్యూబ్ చానెల్ ద్వారా సాయిబాబా ప్రవచనాలు నిర్వహిస్తూ ఆన్లైన్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. సాయి బ్యాగులు, టీ కప్పులు, మొబైల్ కేసుల వంటి అమ్మకానికి ఏకంగా మాన్సీ పేరిట స్టోర్స్ను తెరిచాడు. పూజల పేరిట వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు.
మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విజయవాడకు చెందిన ఓ మహిళ అజ్మాపురంలోని ఆశ్రమంలో బాబాను కలిసింది. తన బాధను చెప్పుకోగా అమె సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని అందుకు హోమం చేయాలని ఆమె వద్ద నుంచి లక్షల రూపాయలను దండుకున్నాడు. ఆమె సమస్య పరిష్కారం కాకపోగా లైంగిక వేధింపులకు గురికావడంతో పాటు తన వద్దనుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితురాలు వారం రోజుల క్రితం ఎస్పీ రంగనాథ్కు ఫిర్యాదు చేసింది. దీంతో నకిలీ బాబాపై విచారణ చేయాలని ఎస్పీ టాస్క్ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన వారు శనివారం రాత్రి విశ్వచైతన్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సుమారు 50 మందికి పైగా బాధితులు ఉన్నట్లు వెల్లడైనట్లు తెలిసింది.
సంవత్సరం కాలంగా ఆశ్రమం నిర్వహిస్తుండగా భక్తుల నుంచి వచ్చిన నగదుతో స్థ్దిరాస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో పోలీసులు సోదాలు నిర్వహించి సుమారు 30 లక్షల నగదు, బంగారం, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లాతోపాటు విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపు రూ.14 కోట్లకు పైగా ఆస్తులు పోగేసినట్లు గుర్తించారు. ఆయా డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సమాచారం.