న్యూఢిల్లీ: ఇండియాలో ధరించగలిగే కాంటాక్ట్లెస్ పేమెంట్ డివైజ్లను లాంచ్ చేసింది యాక్సిస్ బ్యాంక్. వేర్ ఎన్ పే పేరుతో ఈ డివైజ్లను తీసుకొచ్చింది. ఈ డివైజ్లు నేరుగా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటాయి. ఇవి ఒకరకంగా డెబిట్ కార్డుల్లాగా పని చేస్తాయి. ఈ డివైజ్లను తీసుకురావడానికి థేల్స్ అండ్ ట్యాపీ టెక్నాలజీస్తో యాక్సిస్ చేతులు కలిపింది. మాస్టర్కార్డ్ ప్లాట్ఫామ్పై ఈ డివైజ్లు అందుబాటులో ఉంటాయి.
ఎలా పని చేస్తుంది?
యాక్సిస్ బ్యాంక్ వేర్ ఎన్ పే యాక్సెసరీలు బ్యాండ్, కీ చెయిన్, వాచ్ లూప్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల యూజర్లు పేమెంట్ చేయడానికి స్మార్ట్ఫోన్, వాలెట్లు తీసుకెళ్లాల్సిన పని లేదు. కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ వేరబుల్ డివైజ్లు బాగా పని చేస్తాయి. కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్లను అంగీకరించే ఏ వ్యాపారి దగ్గర అయినా వీటి ద్వారా పేమెంట్ చేయవచ్చు. రూ.5 వేల వరకూ చెల్లింపులు చేయడానికి పీఓఎస్ మెషీన్ దగ్గర ఈ డివైజ్ను అలా కదిలించాల్సి ఉంటుంది. ఒకవేళ రూ.5 వేల కంటే ఎక్కువ పేమెంట్లు అయితే పిన్ నంబర్ అవసరం.
డివైజ్ ధర ఎంత?
ఈ డివైజ్లను యాక్సిస్ బ్యాంక్ రూ.750కు అమ్ముతోంది. మీ అకౌంట్ ఉన్న దగ్గరలోని బ్రాంచ్ల నుంచి వీటిని కొనుక్కోవచ్చు. వీటి ద్వారా 10 శాతం క్యాష్బ్యాక్ కూడా ఇస్తోంది. భవిష్యత్తు కాంటాక్ట్లెస్ పేమెంట్లదేనని, ఈ వేర్ ఎన్ పే డివైజ్లు ఆ దిశగా అద్భుతంగా పని చేస్తాయని యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ &పేమెంట్స్ హెడ్ సంజీవ్ మోఘె అన్నారు.