హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ.. మనుషులపై బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతున్నది. అన్ని రాష్ర్టాల్లో ఈ తరహా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో అసలు ఇది ఏవిధంగా సోకుతుంది? గుర్తించడమెలా? లక్షణాలేమిటీ? శరీరంలోని ఏ భాగాలకు సోకుతుంది? నివారణ ఎలా? అనే అంశాలపై యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ మెడిసన్ విభాగానికి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవీ..
ఇది అరుదైన ఇన్ఫెక్షన్. ప్రమాదకరమైంది కూడా. సాధారణంగా మనం దీన్ని మట్టిలో, మొక్కల్లో, ఆకు కూరల్లో, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లలో గమనించవచ్చు. ఎక్కువగా మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ముక్కు భాగంలో తిష్ట వేస్తుంది. క్రమంగా కళ్లు, ముక్కు ప్రాంతంలోని కణాలను, ఎముకలను కొరికేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపై త్వరగా ప్రభావం చూపుతుంది. న్యుమోనియాకు కూడా దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చు.
కొవిడ్కు ముందు సాధారణంగా డయాబెటిక్ రోగులతోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ ఫంగస్ను గుర్తించేవాళ్లం. వాస్తవానికి ఇప్పటికీ వాతావారణంలో ఉంటుంది. ఇది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యంకాదు. ఆరోగ్యవంతులకు సోకడం అరుదు.
బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కరోనా రోగులకే ఎందుకు వ్యాపిస్తుంది?
సాధారణంగానే కరోనా సోకిన సమయంలో రోగి బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిక్ రోగి అయితే షుగర్ లెవల్స్ భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ మనిషిలోని రోగనిరోధక శక్తిని చంపేస్తుంటుంది. కరోనా సోకిన వ్యక్తుల్లో చాలామంది స్టెరాయిడ్స్ వినియోగిస్తుండటంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే వారికి ఎక్కువగా సోకుతుంది.
వ్యాధి సోకిన భాగాన్ని గుర్తించి సీటీ స్కాన్ చేస్తాం. దీనిలో ఫంగస్ను గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారా శాంపిల్ సేకరించి మైక్రోబయోలజీ ల్యాబ్లో పరీక్షిస్తాం. ఈ టెస్టులో పాజిటివ్ రిపో ర్ట్ వస్తే.. ఫంగస్ సోకిన భాగానికి ఆపరేషన్ చేసి ఫంగస్ను పూర్తిగా తొలగించేస్తాం. ఆపరేషన్ తర్వాత మళ్లీ ఇన్పెక్షన్ పెరగకుండా ఉండేందుకు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ ఇస్తాం. ఈ వ్యాధికి రెండు రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నా యి. డీఆక్సోలేట్, నెఫ్రో టాక్సిక్. ఈ రెండింటిలో రెండో ఇంజెక్షన్ ధర రూ.25-50 వేల వరకు ఉంటుంది. దీన్ని ఉపయోగిస్తే ఒక్క రోజులో చికిత్స సాధ్యమవుతుంది.
డయాబెటిక్ రోగులు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ను చెక్ చేసుకుని షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. స్టెరాయిడ్స్ వాడ కం నిలిపేయాలి. ఆక్సిజన్ థెరపీ చేయించుకునేవారు స్టెరైల్ వాటర్నే ఉపయోగించాలి. కానీ, ముక్కు మూసుకుపోయినట్టు అనిపించిన అన్ని సందర్భాల్లోనూ బ్లాక్ ఫంగస్ వల్లేనని ఆందోళన చెందకూడదు. కరోనా రోగులు, వీక్గా ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతానికి కొన్ని బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించాం. ముక్కు మూసుకుపోయినట్లు అనిపించడం, ముక్కులో నుంచి నల్లగా నీరు కారడం, ముక్కు చుట్టూ నొప్పిగా ఉండడం, ముక్కు చుట్టూ చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడడం లాంటి లక్షణాలు ప్రధానమైనవి. కండ్ల నొప్పి, కండ్లు ఉబ్బడం, కండ్ల నుంచి నీరు కారడం, చూపు మందగించడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం లాంటివి కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలే. కొందరు రోగులకు ఛాతీలో నొప్పి కూడా వస్తుంది.