హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తి బాధ్యతారహితంగా సాగిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. గవర్నర్ హోదాలో ఉండి.. గత ప్రభుత్వ పనితీరును బాధ్యతాయుతంగా విభేదిస్తూనే, ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులను సూచించాల్సి ఉంటుందని అన్నారు. గవర్నర్ అసెంబ్లీ వేదికగా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడినట్టు భావించాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వం చేసిన పనులను, ప్రగతిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించి, అవార్డులు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధే జరగలేదన్నట్టు, హైదరాబాద్లో మార్పులు ఏమీ కనిపించనట్టు మాట్లాడటం విడ్డురంగా ఉన్నదని అన్నారు. రోజూ హైదరాబాద్లో తిరిగే గవర్నర్కు ఇక్కడి అభివృద్ధి కనిపించలేదా? అని అడిగారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని గవర్నర్ ప్రసంగంతో మరోసారి రుజువైందని విమర్శించారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వాలని అనేక సంఘాలు మాజీ సీఎం కేసీఆర్ను కోరాయని, అయితే ఆమె ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.