Harish Rao | ఒకరు మతంతో వస్తే.. మరొకరు కులంతో పోటీకి వస్తే.. తాము చేసిన అభివృద్ధిని చూపుతూ ఎన్నికల్లో ప్రజలకు ముందుకు వస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి ఎరుగని సీటు మెదక్ అని.. బీఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి.. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధ పడ్డారన్నారు. వెంకటరామ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.
మంచి వ్యక్తి, మానవతా వాది పేదలను కుటుంబ సభ్యులుగా చూశారన్నారు. 20ఏళ్లు సేవ చేసి ప్రజల హృదయాలు గెలిచారన్నారు. భూసేకరణ ఆయన ఇంటి కోసం చేయలేదని.. దేశంలోనే బెస్ట్ ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారన్నారు. నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇప్పించారన్నారు. మండుటెండల్లో గోదావరి నీటి గలగల పారాయన్నారు. లక్షల ఎకరాల్లో పంట పండిందని.. దాని వెనుక వెంకట్రామ రెడ్డి చెమట చుక్కలు ఉన్నాయన్నారు. ఈ రోజుల్లో చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్కి మెజార్టీ వచ్చిందన్నారు. రఘునందన్ మంచి చేస్తే ఎందుకు ఓడించారన్నారు. మొన్న ప్రభుత్వ ఉద్యోగులను ఏడిపించారన్నారు. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వెంకట్రాంరెడ్డి నీళ్లు ఇవ్వడం తప్పు, ఆయన చేసింది తప్పు అయితే ఓడించాలని.. మంచి అయితే గెలిపించాలని కోరారు. ప్రజలు ఈ విషయం మీద చర్చ చేయాలన్నారు. డబ్బులు సంపాదించదానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వడ్లు కొనాలి అంటే నూకలు బుక్కుర్రి అని బీజేపీ వాళ్లు అన్నారని.. పీయూష్ గోయల్ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓటు అడిగేందుకు వచ్చావన్నారు. బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా..? రఘునందన్ సమాధానం చెప్పాలన్నారు. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపింది బీజేపీ అని విమర్శించారు. వ్యవసాయానికి మద్దతు ధర తెస్తామని రైతులను మోసం చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని మాట తప్పారన్నారు. తెలంగాణ ప్రజలు ఎందుకు బీజేపీకి ఓటెయ్యాలని ప్రశ్నించారు.
బీసీలకు మంత్రిత్వశాఖ పెట్టమంటే అన్యాయం చేశారన్నారు. వర్గీకరణ చేస్తున్నామని దళితులను మోసం చేశారన్నారు. పార్లమెంట్ ఎందుకు బిల్లు పెట్టలేదన్నారు. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని.. ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారన్నారు. 157 ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. తెలంగాణపై బీజేపీకి సవతి తల్లి ప్రేమ అని.. మొదటి దశలో తెలంగాణకు ఎందుకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేదన్నారు నిలదీశారు. ఏం చెప్పి ఇక్కడ ఓటు అడుగుతారు బీజేపీ వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. రూ.13 లక్షల కోట్లు బడా కంపెనీలకు మాఫీ చేశారని.. రైతులకు మాత్రం రూపాయి మాఫీ చేయలేదన్నారు. ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసిన మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమన్నారు. బీజేపీ వాళ్లు ఓటమి భయంతో ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని.. ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.