కొన్ని రకాల పక్షులు విదేశాల నుంచి మన దేశాన్ని ప్రతి సంవత్సరం వలస వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా పెలికాన్ జాతికి చెందిన పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వచ్చి మూడు నాలుగు నెలలు ఇక్కడే నివాసం ఉండి.. తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి యురోపియన్ దేశాల నుంచి తెలంగాణకు నార్తర్న్ పిన్టేల్స్ అనే జాతికి చెందిన బాతులు వలస వచ్చాయి. దాదాపు 7000 కిలోమీటర్లు ప్రయాణించి మరీ అవి తెలంగాణకు చేరుకున్నాయి.
శీతాకాలం పూర్తయ్యే వరకు అవి తెలంగాణలోనే నివాసం ఉండనున్నాయి. నిర్మల్లోని కడ్డం ఫారెస్ట్ రేంజ్కు అవి చేరుకున్నాయి. అయితే.. ఇలా నిర్మల్ జిల్లాకు వేరే దేశాలకు చెందిన పక్షులు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఫారెస్ట్ రేంజ్లో ఉన్న చెరువుల్లో ప్రస్తుతం ఈ బాతులు సేద తీరుతున్నాయి. అక్కడే నివాసం ఉంటున్నాయి.
ఇది పొడవైన మెడ ఉన్న బాతులు. వీటిని కడ్డం ఫారెస్ట్ రేంజ్లోని కల్పకుంట, అకొండపేట గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నేను చూశాను. ఇవి దాదాపు రెండు నెలలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వేసవి కాలం ప్రారంభం కాగానే.. తమ సొంత దేశాలకు వలస వెళ్లిపోతాయి. ఇవి సాధారణంగా యూరప్ నుంచి మంజీరా, ఉస్మాన్ సాగర్.. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న చెరువులకు వలస వెళ్తుంటాయి. కానీ.. ఈసారి మాత్రం నిర్మల్ జిల్లాకు వచ్చాయి.. అని ఖానాపూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వర్ రావు వెల్లడించారు.
డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ జాతి బాతులు ఎక్కువగా ఏసియాలో గడపడానికి ఇష్టపడుతుంటాయి. కడ్డం ఫారెస్ట్ రేంజ్ ఇప్పుడిప్పుడే రకరకాల అరుదైన జాతులకు చెందిన పక్షులను ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు అక్కడికి రకరకాల పక్షులు వచ్చి సేద తీరాయని కోటేశ్వర్ రావు తెలిపారు.