హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలేమో ఈటల రాజేందర్ తమతో టచ్లో ఉన్నాడని, త్వరలో పార్టీలో చేరుతారని చెప్తున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి, ఈటలకు మధ్య గతంలోనే ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు ‘అసలు ఎవరు ఎవరికి టచ్లో ఉన్నారు? ఎవరు ఏ పార్టీలో చేరుతారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది.
మరోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ప్రతిపక్ష పార్టీల సర్వేలే చెప్తున్నాయి. ఇలాంటి బలమైన పార్టీకి చెందిన నేతలు నామమాత్రపు ప్రజాబలం ఉన్న బీజేపీ వంటి పార్టీలోకో, ఎప్పుడో మునిగిపోయిన కాంగ్రెస్లోకో ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు. వాస్తవానికి ఈటల కాంగ్రెస్లో చేరుతారని ఎప్పట్నుంచో ప్రచారం ఉన్నది. గతంలో రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ ‘గోల్కొండ హోటల్’లో రహస్యంగా సమావేశమైనప్పుడే ఈ వాదన బలపడింది. రాజకీయంగా రక్షణ కోసం ఈటల బీజేపీలో చేరి కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్నికల నాటికైనా ఈటల వెళ్లిపోతారని బీజేపీ నేతలే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలే గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని తానుగా ప్రగల్భాలు పలకడంతో బీజేపీలో అంతర్గతంగా కొత్త చర్చ మొదలైంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయించకుండానే ఫలానా నియోజకవర్గంలో పోటీచేస్తానని ఎలా ప్రకటిస్తారని విమర్శలు మొదలయ్యాయి. నమ్మి ఓట్లేసిన హుజూరాబాద్ ప్రజలకు ఇచ్చే మర్యాద ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తడంతో ఈటల స్వరం మారింది. తాజాగా అధిష్ఠానం ఆదేశిస్తే.. అంటూ సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు.