హుజూరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మనిషి బతికి ఉన్నప్పుడు ఎన్ని పగలు, ప్రతీకారాలున్నా చనిపోయిన తర్వాత ఆగర్భ శత్రువులు కూడా అయ్యో అంటారు. అదే మానవత్వం. రాజకీయాల్లో సొంతపార్టీ కార్యకర్తలను నేతలు కండ్లల్లో పెట్టుకొని కాపాడుకొంటుంటారు. కానీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెద్దపాపయ్యపల్లికి చెందిన ప్రవీణ్యాదవ్పై నాటి మంత్రి, నేటి బీజేపీ నేత ఈటల రాజేందర్ పగ సాటి మనుషులకు గగుర్పాటు కలిగించేలా ఉన్నది. బతికున్నప్పుడు ప్రవీణ్ను నానా హింసలు పెట్టిన ఈటల, ప్రవీణ్ చనిపోయిన తర్వాత కూడా తన పగను వదల్లేదని మృతుడి సన్నిహితులు గుర్తుచేసుకొంటున్నారు. ఈటల వల్ల ప్రవీణ్ కుటుంబం పడిన బాధలను ప్రత్యక్ష్యంగా చూసిన అతడి సన్నిహితుడు కన్నెబోయిన మహేందర్ నాడు ఏం జరిగిందన్నది ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.
హుజూరాబాద్లో ఔట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ప్రవీణ్యాదవ్ను నార్మల్ డెలివరీలు కాకున్నా అయినట్టు నోట్ చేయాలని దవాఖాన సూపరింటెండెంట్ రవిప్రవీణ్రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్రెడ్డి వేధించేవారు. తప్పుడు లెక్కలు రాస్తే తనిఖీలో బయటపడుతుందని, తన ఉద్యోగం తీసేస్తారని ప్రవీ ణ్ బతిమాలినా వినకుండా అక్రమ కేసుపెట్టి పోలీసులతో కొట్టించారు. ఉద్యోగం నుంచి తీసేశారు. కేసు అంతా బోగస్. ప్రవీణ్ తల్లి ఈటల కాళ్లమీద పడినా ఆయన కనికరించలేదు. ప్రవీణ్ ఉద్యోగం మళ్లీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా సూపరింటెండెంట్ పట్టించుకోలేదు. ఆ ఆవేదనతోనే ప్రవీణ్ ఆరోగ్య క్షీణించి గుండెపోటుతో చనిపోయిండు.
ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసే విషయం లో కూడా పోలీసులతో కలిసి ఈటల అరిగోస పెట్టిండు. పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని హుజూరాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకుపోయిన్రు. హుజూరాబాద్ దవాఖాన సూపరింటెండెంట్ రవిప్రవీణ్రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్రెడ్డి అక్కడి వచ్చి పోస్టుమార్టం చేసిన్రు. ఇదేం అన్యాయమని అడిగితే మృతదేహం అయినా కావాల్నా.. వద్దా..? అని సీఐ మాధవి బెదిరించింది. పోస్టుమార్టం అయినంక కూడా మాకు బాడీని ఇయ్యలే. వరంగల్ నుంచి పెద్ద పాపయ్యపల్లికి పోలీసులే తీసుకొచ్చిన్రు. ఆలోపే వందమంది పోలీసులను ఊళ్ల దించిండ్రు. ఈటల అప్పుడు కూడా తనకేమీ సంబంధం లేదని బుకాయించిండు. సంబంధం లేకుంటే టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబంలో ఒకరు చనిపోతే రావాలి కదా? ఆ తర్వాతైనా పరామర్శించలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సారు ప్రవీణ్ భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టించిన్రు.
ప్రవీణ్ది పేద కుటుంబం. వాళ్లకు ప్రైవేటు దవాఖాన పెట్టేంత స్థోమత ఉంటదా? ఈటల రాజేందర్ చెప్పేది అబద్ధమని పెద్దపాపయ్యపల్లి ఊరోళ్లకు, హుజూరాబాద్ వాళ్లందరికీ తెలుసు. ఈటలను కలిసేందుకు హైదరాబాద్కు పోయినప్పుడు ఒకసారి మూడు గంటలు ఉన్నా కలవలేదు. మళ్లీ వస్తనని చెప్పి బైటికి పోయి ఫోన్ చేసి 42 నిమిషాలు మాట్లాడిండు. గొల్లోళ్లు మాకేమన్నా సంపాయించి పెట్టిండ్రా? మా కొడుక్కు గొర్రెను ఇచ్చిండ్రా? మా బిడ్డకు మేకను ఇచ్చిండ్రా? మా దగ్గర ఏమన్నా దాయపెట్టిండ్రా? అని అన్నడు.
గెల్లు శ్రీనివాస్ సుట్టమనే కారణంతో ప్రవీణ్ను ఈటల ఇబ్బంది పెట్టిండు. ప్రవీణ్పై పగబట్టి నౌకరీలోంచి తీసేసిండు. ప్రవీణ్ వాళ్ల భూమి సబ్స్టేషన్ కింద పోతే తండ్రి మల్లయ్యకు గ్రామస్థులందరం కలిసి నౌకరీ పెట్టించినం. ఈటల రాజేందర్ చెప్పేవన్ని పచ్చి అబద్ధాలు. ప్రవీణ్ చావుకు ఈటల
రాజేందరే కారకుడు.
–భాషబోయిన విజేందర్, పెద్దపాపయ్యపల్లె
ఆయన వల్లే ప్రవీణ్ కుటుంబం ఆగమైంది
ఈటల రాజేందర్ ప్రవీణ్ను నౌకరీలోంచి తీసివేయడంతో రంది పడ్డడు. చేయని తప్పుకు పోలీసులతోని కొట్టించిండు. ఆరోగ్యం దెబ్బతినడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడు. చచ్చిపోయినంక కూడా ఈటల పగబట్టిండు. ఈటల రాజేందర్ కనికరం లేని మనిషి.
–ముక్కెర రమేశ్, పెద్దపాపయ్యపల్లె
బీజేపీ అంటేనే డ్రామా ఆర్టిస్టుల పార్టీ. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ డ్రామాలకు తెరలేపుతారు. ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ గుండెనొప్పి, దుబ్బాకలో రఘునందన్రావు చేతికట్టు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కట్లు కట్టుకొని ప్రజల సానుభూతి పొందేందుకు నాటాకాలు ఆడి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ అదే డ్రామాలు ఆడేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉన్నది. ప్రజలు గమనించాలి.
–బాల్క సుమన్, ప్రభుత్వ విప్
సామాన్య వ్యక్తిగా ఉన్న ఈటల రాజేందర్ను రాష్ట్రస్థాయి నాయకుడిని చేసి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించడం సహా రెండుసార్లు మంత్రి పదవి ఇస్తే కన్నతల్లి వంటి టీఆర్ఎస్పై కుట్రలు చేశారు. అన్నదమ్ముల నుంచి వేరుపడ్డప్పుడు ఎకరం భూమి ఉన్న నువ్వు ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఎలా సంపాదించావో హుజూరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడుగు. నీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టకుండా, నువ్వు మాత్రం
పెద్ద ఇల్లు కట్టుకొని వేల ఎకరాలు సంపాదించావు. కేసీఆర్ సంస్కరణలు, సంక్షేమం, సాగు, తాగునీటి పథకాలకు చైతన్యవంతులైన ప్రజలు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలి.
–ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే
రాష్ట్రంలోని బీడు భూములను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు విజ్ఞతతో ఓటేయాలి. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలి. మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేని వ్యక్తి, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటల ఏంచేస్తారో ప్రజలే ఆలోచించాలి.
–యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఈటల నీతి, జాతి, సిద్ధాంతం లేని వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు రాజీనామా చేసిండో చెప్పాలే. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? జిల్లా కోసమా? తన అక్రమాస్తుల కేసు నుంచి బయట పడేందుకా? ప్రజలపై ఆయనకు అసలే పట్టింపుల్లేవ్. తన సొంత విషయాన్ని ఇక్కడి ప్రజలకు రుద్దుతున్నడు. ఈటల గతంలో వివేకానందుడి విగ్రహం పెట్టనీయలేదు. వివేకానంద కమిటీ, సభ్యులపై కేసులు పెట్టించిన చరిత్ర ఆయనది. ఇక్కడి సమాజం తెలివి తక్కువదని అనుకోవద్దు.. మీ అసలు రంగు తెలిసిపోయింది. ఎన్నికల తర్వాత పార్టీ వీడిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై బీజేపీ అధిష్ఠానం ఆలోచించాలి. పార్టీలో చేరి మూడు నెలలైంది. ఇప్పటివరకు భారత్మాతాకీ జై, వందేమాతరం, జైశ్రీరాం అనలేదు.
–ఆవుల తిరుపతి, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు
నేను కళాకారుడిని. తెలంగాణ ఉద్యమంల గజ్జెకట్టి ఆడిపాడిన. తెలంగాణ వచ్చినంక సాంస్కృతిక సారథిల ఉద్యోగం కోసం ఈటల దగ్గరికి పోతే నమ్మించి మోసం చేసిండు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. అంబేద్కర్ కూడలిలో ఈటల కాళ్లు పట్టుకున్న.. అయినా కనికరించలేదు. ఆయనకు మేమెందుకు ఓటెయ్యాలె. నాలాంటి ఎందరో కళాకారులను మోసం చేసిండు. రైతు చట్టాలను వ్యతిరేకించాల్సిందిపోయి.. బీజేపీలోనే చేరిన ద్రోహి ఆయన. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ కేంద్రం ప్రైవేట్పరం చేస్తున్నది. అన్నీ ప్రైవేట్పరమైతే ఇక ప్రభుత్వ ఉద్యోగాలుండయ్. అప్పుడు రిజర్వేషన్లు కూడా ఉండయ్. అందుకే బీజేపీని గానీ, అందులో చేరిన ఈటలను గానీ దగ్గరికి రానియొద్దు.
-మోరే మధు, హుజూరాబాద్