హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం అందుతున్నదని మరోసారి కేంద్రం ధ్రువీకరించింది. రాష్ట్రంలోని మరో 13 దవాఖానలకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాష్) సర్టిఫికెట్లు వచ్చాయి. మరో 3 దవాఖానలకు రీ సర్టిఫికేషన్ (రెన్యూవల్) వచ్చింది. దీంతోపాటు నిర్మల్ ఏరియా దవాఖానకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వైద్యారోగ్య శాఖకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎన్క్వాష్ సర్టిఫికెట్లు పొందిన దవాఖానల సంఖ్య 143కు చేరింది. దేశంలో అత్యధిక ఎన్క్వాష్ సర్టిఫికెట్లు దవాఖానల సంఖ్య 143కు చేరింది. దేశంలో అత్యధిక ఎన్క్వాష్ సర్టిఫికెట్లు కలిగిన ప్రభుత్వ దవాఖానలున్న రాష్ర్టాల్లో తెలంగాణ 4వ స్థానానికి చేరుకొన్నది. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటేనే పాత, పెచ్చులూడిన, రంగులు వెలిసిపోయిన భవనాలు, దుర్గంధం, కనీస వసతులు కరువై నరకానికి నకలుగా ఉండేవి. ఇన్పేషెంట్, సర్జికల్ వార్డుల్లో అయితే పాత రోగం తగ్గడం అటుంచి.. కొత్త రోగాలు అంటించేంత దుస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఓపీ, ఐపీ, సర్జికల్.. ఇలా ప్రతి విభాగంలోనూ నాణ్యత పెరిగింది. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతున్నదని ఎన్క్వాష్ సర్టిఫికేషన్తో తేలింది.
వందల నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ హెల్త్ సిస్టమ్ రీసోర్స్ సెంటర్’ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కో విభాగంలో ఉండాల్సిన నాణ్యతాప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలనే ‘నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్’ (ఎన్క్వాష్) అని పిలుస్తారు. ఎన్క్వాష్ సర్టిఫికెట్ అంత సులభంగా రాదు. కేంద్రం నిర్దేశించిన వందల సంఖ్యలో ప్రమాణాలను దవాఖానల్లో పాటించాల్సి ఉంటుంది. జిల్లా, ఏరియా దవాఖానలకు 365 ప్రమాణాలను నిర్దేశించారు. సీహెచ్సీ, యూపీహెచ్సీలు సైతం వందల ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
కేంద్ర బృందం వచ్చి దవాఖానలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు, సిబ్బంది శిక్షణ, సపోర్ట్ సర్వీసెస్, క్లినికల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? ఇన్ఫెక్షన్ కంట్రోల్, నిబంధన ప్రకారం క్వాలిటీ మేనేజ్మెంట్ పాటిస్తున్నారా? నెలకు ఎంత మందికి చికిత్స అందిస్తున్నారు? వంటి 8 అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఎన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో గుర్తించి స్కోర్ ఇస్తారు. కనీసం 70 శాతం స్కోర్ దాటితేనే క్వాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ‘లక్ష్య’ సర్టిఫికేషన్లోనూ లేబర్ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్ను పరీక్షిస్తారు. 70 శాతం స్కోర్ దాటితే సర్టిఫికెట్ ఇస్తారు.
ప్రమాణాలు పాటిస్తే పారితోషికం..
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం
ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం హర్షణీయం. కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల్లో రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గుర్తింపును సాధిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యంలో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. కేసీఆర్ చిత్తశుద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయస్థాయి గుర్తింపే నిదర్శనం. రాష్ట్రంలో పీహెచ్సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. ఇందుకు కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నది. దేశంలో మొదటిస్థానంలో నిలవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– తన్నీరు హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి