రాష్ట్రంలో అన్ని బడుల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ఎట్లా ఉంటుంది? పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి? అన్న వాటిపై విద్యావేత్తలు, మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న చర్య విప్లవాత్మకమని అంటున్నారు. దీనిని ఆదర్శం నుంచి ఆచరణ వరకు తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలోని భావి తరాలను భవిష్యత్తులోకి నడిపిస్తాయని చెప్తున్నారు. తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం కావాలని తల్లిదండ్రులు కోరుకొంటున్నారు. తమ విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులు తపనపడుతున్నారు. చదువు చెప్పేవారికి, చెప్పించుకొనేవారికి వంతెన లాంటిది ఆంగ్ల మాధ్యమం. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం మీద ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తిచేస్తూ, సీఎం కేసీఆర్ చర్య ఎంత ముందుచూపు కలిగి ఉన్నదో వివరిస్తూ.. విద్యారంగ నిపుణుడు, ఎన్సీఈఆర్టీ కార్యవర్గ మాజీ సభ్యుడు, ఎస్సీఈఆర్టీ సమన్వయకర్త సువర్ణ వినాయక్ ప్రత్యేక కథనం తొలిభాగం..
బడి సమాజానికి ప్రతిబింబం. పిల్లల ప్రపం చం. బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే క్షేత్రం. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు రూపాన్నిచ్చే సంస్థ. తల్లిదండ్రులు తమ కలలను సాకారం చేసుకునే క్షేత్రంగా భావించే సంస్థ. సాంఘికీకరణకు/ సామాజికీకరణకు కేంద్రం బడి’. ఈ బడుల్లో ప్రభుత్వ బడులకున్న స్థానం ప్రత్యేకమైనది, విశిష్ఠమైనదని భావించాలి. ఒక సమాజంలో ఉండే అనేక సంస్థల్లో ప్రభుత్వ బడి ఒక్కటే అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న సంస్థ. ప్రభుత్వ బడి కేవలం బడిలో చదువుతున్న పిల్లలకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులను, సమాజ సభ్యులను, విభిన్న వర్గాలకు చెందిన ప్రజలను సమీకరించి, చైతన్యపరిచే అవగాహన కేంద్రంగా కూడా విశిష్ఠమైన పాత్రను పోషిస్తున్నది. విభిన్న కార్యక్రమాల ద్వారా అందుకు వేదికగా నిలుస్తున్నది. దురదృష్టవశాత్తు అలాంటి ప్రభుత్వ బడి ప్రమాదంలోకి నెట్టబడడం గమనార్హం. ఆ ప్రభుత్వ బడిని బలోపేతం చేసి దాని ఉనికిని శాశ్వతమయ్యేలా చేయాల్సిన అత్యవసరమైన పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబడమనే ప్రభుత్వ చర్య చీకటిని పారదోలే వెలుగుదివ్వెగా భావించాలి. ఇది ఒక సామాజిక బాధ్యత కూడా.
సుమారు రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో 80% మంది పిల్లలు చదువుకుంటే ప్రైవేటు బడుల్లో 20% మంది ఉండేవారు. 2005 సంవత్సరం నాటికి 70% ప్రభుత్వ బడుల్లో, 30% మంది ప్రైవేటు బడుల్లో ఉన్న పరిస్థితి నెలకొన్నది. క్రమేణా ప్రభుత్వ బడుల్లో పిల్లలు 49 శాతానికి పడిపోతే ప్రైవేటు బడుల్లో 51 శాతానికి పెరగడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధన కొరవడటం, ఆంగ్ల మాధ్యమం లేకపోవడం అని భావించవచ్చు. ప్రస్తుతమున్న పిల్లల సంఖ్య కూడా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రభావం వల్లనే అని గణాంకాలు మరియు క్షేత్ర స్థాయిలోని ఉపాధ్యాయుల అభిప్రాయాల వల్ల తెలుస్తున్నది.
ఇందుకోసం ఈ దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం అనేది సమాజంలో హోదాకు చిహ్నంగా మారిపోయింది. అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ఉద్యోగాలు లభిస్తాయి అనే భావన కూడా వ్యాప్తి చెందింది. ఇది వాస్తవం కూడా! ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో విస్తృతమైన ఉద్యోగాల కల్పన జరిగిన తరువాత ఆంగ్లం యొక్క ప్రాధాన్యం విశ్వజనీనమైన సామాజిక అవసరంగా రూపుదాల్చింది. ఆంగ్ల భాషలో భావప్రసార నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చి బహుళజాతి సంస్థలు ఉద్యోగ నియామకాలు చేపట్టడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. దీంతో పాటు సమాజంలోని సంపన్న వర్గాలు, ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు దాదాపు ఎక్కువ శాతం మంది విద్యావంతులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడం కూడా ఆంగ్ల మాధ్యమం వైపు మిగిలిన వర్గాలు ప్రేరేపితులు కావడానికి కారణమైంది. దళిత, వెనుకబడిన వర్గాల నాయకులు మరియు మేధావులు కూడా తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలని, ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాలను నెలకొల్పాలని డిమాండు చేయడం కూడా పేర్కొనదగిన అంశం. ఉన్నత వర్గాల పిల్లలతో పాటు తమ పిల్లలు కూడా సమానమైన హక్కులను, మేధో శక్తిని కలిగి ఉన్నారని, అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదగగలమని నినదించడం కూడా చూస్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల భాషా బోధన ఒక సబ్జక్టుగా వైఫల్యాలను ఎదుర్కోవడం, పిల్లల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలు కొరవడడం కూడా కారణమైంది. ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నా రెక్కాడితే డొక్కాడని కష్ట జీవులు కూడా తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమం కోసం ప్రైవేటు బాట పట్టడానికి వెనుకాడడం లేదు.
ఈ పరిస్థితులు క్రమేణా ఆంగ్ల మాధ్యమం అనే డిమాండుకు ప్రాణం పోశాయి. సమాజంలో రాజకీయ వర్గాలకు ప్రచారాస్త్రంగా మారింది. ఈ క్రమంలో ప్రైవేటు బడులకు ప్రత్యమ్నాయంగా నాణ్యమైన విద్యకు ప్రతీకలుగా భావించబడుతున్న ప్రభుత్వ నియంత్రణలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకులాలు, మోడల్ స్కూళ్ళు వంటి ఆంగ్ల మాధ్యమ బడుల్లో చదువుకుంటున్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు సాధిస్తున్న ఫలితాలు కూడా ఆంగ్ల మాధ్యమం యొక్క డిమాండును సార్వత్రికమయ్యేలా చేశాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులకు ధీటుగా నిలబడిన ప్రభుత్వ బడుల్లో 3 లక్షల మంది పిల్లలను తల్లిదండ్రులు చేర్చడం కూడా గమనించాల్సిన అంశం. వీరిలో ఎక్కువ శాతం మంది ఆంగ్ల మాధ్యమం నుండి వచ్చినవాళ్ళే. వారు తిరిగి బడిని వీడకుండా చేయడానికి మరియు ఉన్న పిల్లలు జారిపోకుండా చూడడానికైనా, ప్రభుత్వ బడులను బతికించడానికైనా ఆంగ్ల మాధ్యమం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం తల్లిదండ్రుల ఆశయాలను, ఆకాంక్షలను సాకారం చేసే నిర్ణయంగా భావించాలి. నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మాభిమానం కోసం గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో వారే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసే చర్యల్లో ఇది మరొక ముఖ్యమైన నిర్ణయంగా భావించాలి. దీని ద్వారా అన్ని వర్గాల పిల్లలకు విద్యలో సమానావకాశాలు కల్పించినట్లు అవుతుంది. బడుగు, నిమ్న వర్గాల పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందింపజేస్తుంది. పేద వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వెచ్చించే ఆదాయాన్ని పొదుపు చేయడానికి సహాయం చేసినట్లవుతుంది. ప్రజాభిప్రాయాలకనుగుణంగా సామాజిక అవసరాన్ని గుర్తించి విజ్ఞానంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా ఆంగ్ల మాధ్యమాన్ని భావించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఇందుకోసం విధి విధానాలను నిర్ధారించడానికి రాష్ట్ర మంత్రివర్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాలి. ఒకవైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మరోవైపు ప్రభుత్వ బడుల ముఖ చిత్రాన్ని మార్చడానికి, సౌకర్యాలను మెరుగుపర్చడానికి మన ఊరు-మన బడి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా ప్రభుత్వ బడులు నూతన జవసత్వాలను సంతరించుకుంటాయనవచ్చు.
అయితే ఈ సందర్భంలో సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది మేధావులు రేకెత్తించిన అంశాలను కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. అవి ప్రధానంగా (1) తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు మాధ్యమంలోనే బోధించడానికి అలవాటుపడిన ఉపాధ్యాయులు ఇప్పటికిప్పుడు ఆంగ్ల మాధ్యమంలో బోధించే సమర్థతను కలిగి ఉంటారా? (2) మాతృ భాషతో పోల్చినపుడు ఆంగ్ల భాషా మాధ్యమంలో నేర్చుకోవడం వల్ల పిల్లలకు లోతైన పరిజ్ఞానం కలుగుతుందా? (3) తెలుగు మాధ్యమంలో నేర్చుకొంటున్న పిల్లలను ఆంగ్ల మాధ్యమం వైపు మరల్చడం వల్ల వారు నష్టపోరా? (4) ఆంగ్లం వల్ల ఇప్పటికే ముప్పును ఎదుర్కొంటున్న తెలుగు భాష ఆంగ్ల భాషా మాధ్యమం వల్ల తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొనదా? (5) తెలుగు మాధ్యమంలోనే నాణ్యత ప్రశ్నార్థకంగా ఉన్నపుడు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యత మరింత దిగజారదా? మొదలగునవి.
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కోఆర్డినేటర్, కరిక్యులమ్ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు సువర్ణ వినాయక్ ప్రత్యేక కథనం తొలిభాగం.