హైదరాబాద్/ ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివిన పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. ఎంసెట్లో పదివేలకంటే ఎక్కువ ర్యాంకు వచ్చినా ఈ ఏడాది నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్నది. గతేడాది వరకు ఓసీ, బీసీ విద్యార్థులకు ఎంసెట్లో పదివేలలోపు ర్యాంకు వస్తేనే ఇంజినీరింగ్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో 4,566 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. టాప్టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చినా ప్రభుత్వ విద్యార్థులకు ఈ అవకాశం ఉండనున్నది.
ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఎంసెట్లో 10వేలలోపు ర్యాంకు వచ్చినవారికి ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏ కులం వారికైనా ఇది వర్తిస్తుంది. పదివేల పైన ర్యాంకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తమ కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికంటే తక్కువే ఉన్నదని ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తున్నది. పదివేల పైన ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు రూ.35 వేలు ఫీజు రీయింబర్స్మెంట్గా చెల్లిస్తుండగా, మిగతా ఫీజును విద్యార్థులే భరించాలి. తాజా నిర్ణయం ప్రకారం సర్కారు కాలేజీల్లో చదివిన ఏ కులం విద్యార్థులకైనా ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్లలో లబ్ధిపొందిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిసుంది. వీరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మించి ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు.
విద్యార్థుల ఆనందం
ఈ ఏడాది ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్లో ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దాంతో ఫీజుల భారంతో భయపడుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు జీరో అని వెబ్సైట్లో చూపించటంతో ఎగిరి గంతేస్తున్నారు. వేలకువేల ఫీజులకు డబ్బు కూడగట్టుకోలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. టెక్, బీఆర్క్ కోర్సుల్లో చేరేవారికి ప్రస్తుతం అవకాశం కల్పించారు.
పేద విద్యార్థులకు వరం
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఉత్తమ కళాశాలల్లో బీటెక్ చేసేందుకు ఆర్థిక స్తోమత లేక వెనక్కు పోవాల్సిన వస్తున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి గొప్ప అవకాశం. భవిష్యత్తులో మరింత మంది మంచి ఇంజినీర్లు బయటకు రావడానికి ఇలాంటి నిర్ణయాలే దోహాదపడతాయి.
-అట్లూరి వెంకటరమణ, విద్యావేత్త, ఖమ్మం