హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ ఫీజులు ఈ విద్యాసంవత్సరం కాస్త పెరగనున్నాయి. బీటెక్ గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలు, కనిష్ఠ ఫీజు రూ.45 వేలుగా ఉంది. గరిష్ఠ ఫీజు ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు ఉండగా, ఆ తర్వాత సీవీఆర్ కాలేజీలో రూ.1.50 లక్షలు, వర్ధమాన్ కాలేజీలో రూ.1.40 లక్షలు ఉన్నట్టు తెలిసింది. ఆయా ఫీజులను సిఫారసు చేస్తూ రూపొందించిన నివేదిక శుక్రవారం ప్రభుత్వానికి చేరింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అధికారులు ఆ నివేదికను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు పంపించారు.
రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్ కాలేజీలుండగా.. నల్లగొండ జిల్లాలోని స్వామి రామానందతీర్థ కాలేజీ మాత్రం ఈ ఏడాది ఫీజుల సవరణకు దరఖాస్తు చేసుకోలేదు. మిగిలిన 172 కాలేజీల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారుచేసి, నివేదికను ప్రభుత్వానికి పంపించింది. వీటిలో 30 వరకు కాలేజీల్లో ఫీజు లక్షకు పైగా ఉండగా, 60కిపైగా కాలేజీల్లో రూ.45 వేలు (కనిష్ఠ ఫీజు)గా ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే.. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆయా ఫీజులను ఖరారుచేస్తూ జీవోను జారీచేస్తారు. ఆయా ఫీజులు 2022 -25 బ్లాక్ పీరియడ్కు మూడేండ్ల పాటు అమల్లో ఉంటాయి.
ఎంసెట్ మూడు విడుతల కౌన్సిలింగ్, రిపోర్టింగ్, స్పాట్ అడ్మిషన్లు ముగిసి అంతా సర్దుబాటు అయిన 10 రోజుల తర్వాతే ఆయా ఫీజులను కాలేజీలకు బదిలీ చేస్తారని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. విద్యార్థుల నుంచి ప్రస్తుతానికి పాత ఫీజులే వసూలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే జీవోను బట్టి పెరిగితే అదనంగా, తగ్గితే విద్యార్థి చెల్లించిన ఫీజు నుంచి వాపసు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియంతా ఎంసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నేతృత్వంలోనే జరుగుతుందని పేర్కొన్నారు.