హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): జనగామ ఆర్డీవో తనను అవమానిస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ రజిత ఆరోపించిన ఘటనపై కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ట్రెసా పేర్కొన్నది. ఉద్యోగులు, శాఖల మధ్య దూరం పెంచేలా మాట్లాడడం సరికాదని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, కే గౌతమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విధుల్లో భాగంగానే ఆయన కాస్త కఠినంగా వ్యవహరించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖల ఉద్యోగులు ఐకమత్యంగా పనిచేయాలని, అప్పుడే ప్రజా సమస్యలు పరిషారం అవుతాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ ఆర్డీవో మధుమోహన్ తన డివిజన్లో, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగులంటే అందరికి గౌరవభావం ఉంటుందని, అన్ని శాఖల ఉద్యోగులు తమకు సోదర, సోదరీమణులే అని వెల్లడించారు. గతంలో ఎన్నడూ స్పందించనివారు ఇప్పుడు ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు చేయడం సరికాదని పేర్కొన్నారు.
జనగామ ఆర్డీవో మధుమోహన్ తనను అవమాన పరుస్తున్నారని మున్సిపల్ కమిషనర్ రజిత కన్నీరు పెట్టుకున్న సంఘటనపై కొన్ని సంఘాలు, వ్యక్తులు ఏకపక్షంగా మాట్లాడటం భావ్యం కాదని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం పేర్కొన్నది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను జిల్లా కలెక్టర్లు అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయంతో అమలుచేస్తున్నారని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే అంశాలను పెద్దగా చిత్రీకరించడం తగదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టిపెట్టాలని సూచించారు.