హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి టీఎన్జీవో భవన్ వద్ద ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి, బీజేపీ నేతకు వ్యతిరేకంగా నినదించారు. వివిధ కార్యాలయాల నుంచి ర్యాలీగా టీఎన్జీవో భవన్కు ఉద్యోగులు వచ్చారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఉద్యోగులు టీఆర్ఎస్కు అనుకూలమని మాట్లాడారని ఆరోపించారు. మా ఎన్నికల వివరాలు సంజయ్కి చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఉద్యమం చురుగ్గా ఉన్న సమయంలో బీజేపీ, బండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యోగుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమన్నారు. తాము ఇన్కం టాక్స్ స్లాబ్ను పెంచాలని కోరామని, మరి మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు.
టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఎంపీ సంజయ్ తెలంగాణ ఉద్యోగ సంఘాలను అవమానించేలా మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ 2015లో 42 శాతం, 2021లో 30 శాతం పీఆర్సీ ఇచ్చారన్నారు. ఉద్యోగులు అడిగినదాని కంటే ఎక్కువగానే ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులు అమ్ముడుపోయారని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, కేంద్రాన్ని ఒప్పించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయించాలని డిమాండ్ చేశారు.