హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): అర్హులందరికీ మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నూతన మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు చెప్పారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని శాఖ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణలో మత్య్సకారుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిన నేపథ్యంలో 18 ఏండ్లు వయస్సు నిండిన అర్హులకు సభ్యత్వం కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 4,735 సొసైటీలు ఉండగా 3,47,901 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. మరో 1,185 సొసైటీల ఏర్పాటుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.