కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 10: బైక్ ప్రయాణంలో శిరస్సుకు రక్షణగా ఉపయోగించే హెల్మెట్ను బహుళ ప్రయోజనాలకు ఎందుకు ఉపయోగించకూడదు? ఈ ప్రశ్న మదిలో మెదిలిన వెంటనే ఓ వసతిగృహ సంక్షేమాధికారి తన ఆలోచనకు పదును పెట్టారు. ఓవైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు చిన్న చిన్న విద్యుత్ ఉపకరణాలతో మల్టీపర్పస్ ఎలక్ట్రానిక్ హెల్మెట్ను ఆవిష్కరించారు. ఆయనే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన అంబటి పూర్ణచందర్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వెల్ఫేర్ విభాగంలో వసతిగృహ సంక్షేమాధికారిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. మైక్రో ఫ్యాన్, మస్కిటో నెట్, బ్లూటూత్, టార్చ్లైట్, వాచ్, ఐపాడ్, వైఫై, సీసీ కెమెరా, పవర్ బ్యాంక్ లాంటి పలు రకాల విద్యుత్ ఉపకరణాలను కలిగి ఉండటం ఈ హెల్మెట్ ప్రత్యేకత. దాదాపు నెల రోజులు శ్రమించి తయారు చేసిన ఈ హెల్మెట్ను ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించాలనుకుంటున్నట్లు ఆయన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.