పెద్దపల్లి, సెప్టెంబర్ 15: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్తు మరమ్మతు పనులు చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్ (ఎస్ఎస్ఆర్) పెంచాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే సమ్మెతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 విద్యుత్తు సర్కిళ్లలో విద్యుత్తు మరమ్మతు పనులు నిలిచిపోనున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరాలో సమస్యలు తలెత్తనున్నాయి. ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని ఎన్పీడీసీఎల్ సీఎండీకి వినతిపత్రాలు అందించి, చర్చించినా ఫలితం లేకపోవడంతో సమ్మెలోకి వెళ్తున్నామని అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అలుగుబెల్లి కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం పెద్దపల్లి సర్కిల్ ఆఫీస్లో ఏడీఈ (టెక్నికల్) అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు.