యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరీ మోగించింది. ఖాళీ అయిన మూడు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగ్గా మూడింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్లో ఎన్నికలు నిర్వహించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటించారు. డైరెక్టర్లుగా టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు గెలుపొందారు. ఇందులో కస్తూరి పాండుకు 241, గొల్లపల్లి రాంరెడ్డికి 239, మందడి ప్రభాకర్రెడ్డికి 204 ఓట్లు వచ్చాయి. నూతన డైరెక్టర్లను మంత్రి జగదీశ్రెడ్డి అభినందించారు.
నేడు చైర్మన్ ఎన్నిక
బుధవారం హయత్నగర్లో మదర్ డెయిరీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత 12 మంది డైరెక్టర్లతోపాటు తాజాగా ఎన్నికైన వారు చైర్మన్ను ఎన్నుకోనున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి దక్కనున్నట్టు తెలుస్తున్నది.