హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): యూఎస్ కాన్సులేట్ ద్వారా ఏటా 10 లక్షల వీసా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు యూఎస్ కాన్సులేట్ (తాత్కాలిక) జనరల్ రెబెకా డ్రామే వెల్లడించారు. స్టూడెంట్ సహా అన్ని రకాల వీసాలు కలుపుకొని మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. యూఎస్ఏ యూనివర్సిటీ ఫెయిర్ను శనివారం మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించారు. టాప్-40 వర్సిటీల నుంచి 5 వేలకు పైగా విద్యార్థులు ఈ ఫెయిర్ను సందర్శించారు. సెప్టెంబర్ 3 వరకు ముంబై, పూణె, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరుల్లోనూ ఇలాంటి ఫెయిర్లను నిర్వహిస్తామని రెబెకా తెలిపారు. ఫెయిర్ను ప్రారంభించిన అనంతరం కాసేపు మీడియాతో మాట్లాడిన ఆమె.. అమెరికాలో చదువుల సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు travel.gov.in యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్, స్కాలర్షిప్స్కు సంబంధించిన సమాచారం ఈ వెబ్సైట్లో లభిస్తుందని తెలిపారు. స్టూడెంట్ వీసాల కోసం వచ్చేవారికి కాన్సులేట్లో ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఇతరులు చెప్పినవి నమ్మవద్దు
తెలిసిన వాళ్లు చెప్పారనో, బంధువులు చెప్పారనో అమెరికాలో చదువులకు సంబంధించిన సమాచారాన్ని నమ్మవద్దని రెబెకా సూచించారు. కన్సల్టెన్సీలు, ఇతరులు చెప్పే వివరాలను గుడ్డిగా నమ్మవద్దని కోరారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోవద్దని, విద్యార్థులు చెల్లించే ఫీజులు చాలా స్వల్పంగా ఉంటాయని అన్నారు. సర్వీసు ఫీజు 350 డాలర్లు, వీసా ప్రాసెసింగ్ ఫీజు 185 డాలర్లు మాత్రమేనని తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఏఐ వంటి ఎమర్జింగ్ కోర్సులనే ఇష్టపడుతున్నారని, స్టెమ్ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని తెలిపారు. వీసా డాక్యుమెంట్ల విషయంలో నిజాయతీగా ఉండాలని, వీసా ఇంటర్వ్యూ సమయంలో ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అడిగిన ప్రశ్నకు తెలిస్తే సమాధానం చెప్పాలని, లేదంటే తెలియదని చెప్పాలన్నారు. మోసం చేసేందుకు ప్రయత్నించి సమస్యలు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. అమెరికాలో హోంల్యాండ్ సెక్యూరిటీ ఇటీవల 21 మంది విద్యార్థులను వెనక్కి పంపిన ఘటనపై మాట్లాడుతూ ఇలాంటివి సర్వసాధారణమేనని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30 వరకు గడువు
అక్టోబర్ 1, 2022 తర్వాత జారీచేసిన వీసా అపాయింట్మెంట్ల గడువు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని, ఆలోగా దరఖాస్తుదారులు తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావడమో, లేదంటే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను మరో రోజుకు వాయిదా వేసుకోవడమో చెయ్యాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆలోపు వీసా ప్రాసెసింగ్ ఫీజులు పెంచితే ఇప్పటికే చెల్లించిన ఫీజులు చెల్లుబాటవుతాయని, గడువు దాటితే మాత్రం ప్రయోజనం ఉండదని రెబెకా స్పష్టం చేశారు.