శివ్వంపేట : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar ) ఆశయ సాధనకు విద్యే ఆయుధమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Minister Damodara Rajanarsimha) అన్నారు. ఆదివారం శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్మారెడ్డి ( MLA Sunita Laxma reddy) తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, స్పూర్తి ప్రధాత అని కొనియాడారు. భారతరాజ్యాంగాన్ని రూపొందించి ప్రతీ పౌరుడికి సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించిన మహనీయులని, రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ఎదురుకొని మంచి విద్యను అభ్యసించి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం సాధ్యమైందన్నారు. అంబేద్కర్ సేవలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో నిర్మించిన నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు హైదరాబాద్ లో అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి నియోజకవర్గానికి 100 బోర్లుతో పాటు దానికి సంబంధించిన పైపులైన్లు, మోటర్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గంలో బీటీ రహదారుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విగ్రహదాత గౌరెడ్డి వెంకటనర్సింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర మురళీగౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ముండ్రాతి బాలేష్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిరాజుయాదవ్, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమణాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.