హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదనపు డైరెక్టర్ పరుచూరి దినేశ్ హైకోర్టుకు హాజరై, బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఐదేండ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన ప్రభాత్ స్టోర్స్, మనీ ఛేంజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీలోని ఫారిన్ ఎక్స్చేంజ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి అనుకూల ఉత్తర్వులు పొందాయి. వీటిని సవాల్ చేస్తూ అప్పుడు ఈడీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పిటిషన్పై ఈడీ ఉన్నతాధికారి కోర్టుకు హాజరుకావాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఎవరూ విచారణకు రాకపోవడంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఈడీ అదనపు డైరెక్టర్ దినేశ్ స్వయంగా విచారణకు హాజరై కోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. సమాచార లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో గతంలోని వారెంట్ను హైకోర్టు వెనకి తీసుకొన్నది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.