హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ (DC) మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని (Venkatrami Reddy) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో (Money laundering case) ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (DCHL) ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామిరెడ్డితోపాటు పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మణి ఊమెన్లను కేసులో అదుపులోకి తీసుకున్నది. వీరిని బుధవారం ఉదయం హైదరాబాద్ నాంపల్లిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. కెనరా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులను సుమారు రూ.1500 కోట్లు మోసం చేసినట్లు వారిపై ఈడీ అభియోగాలు మోపింది.
సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ.. వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3,300 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. డీసీహెచ్ఎల్, దాని ప్రమోటర్లు వివిధ బ్యాంకుల నుంచి రూ.8,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. కానీ వాటిని మళ్లీ కట్టకుండా ఎగవేశారు. దీంతో వారి కేసు నమోదుచేసిన ఈడీ.. పలుమార్లు దాడులు నిర్వహించింది. న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులోని కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది.