హైదరాబాద్/నాగర్కర్నూల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కొత్త హంగులు, ఆకర్షణలతో సరికొత్తగా వైల్డ్ లైఫ్ టూరిజం మరోసారి ప్రజలకు అందుబాటులో రానున్నది. పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్) పరిధిలో శుక్రవారం టైగర్ సఫారీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించనున్నారు. టైగర్ సఫారీ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన వాహనాలు ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఏటీఆర్లోని ఫర్హాబాద్ టైగర్ సఫారీని 2021 నవంబర్లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాదికొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. కొవిడ్ రెండో దశ ఉధృతితో 2022లో సఫారీ నిర్వహణ వాయిదా పడింది. ఈసారి సరికొత్తగా సిద్ధమవుతున్నది. సందర్శకులు దాదాపు 24 గంటలపాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రిపూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బసతో కొత్త అనుభూతిని కలిగించే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు అటవీశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్ల సందర్శన ఉంటుంది. అనంతరం అడవిలో ట్రెక్కింగ్కు తీసుకెళ్తారు. సాయంత్రం క్యాంప్నకు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు ఉదయం సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్తారు. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం వివరాలను ప్రజలకు తెలిసేలా ఏటీఆర్ పేరిట ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. అభయారణ్యంలోని పెద్దపులులు, చిరుతలు, వన్యప్రాణులు, చెట్లు, పక్షుల ఫొటోలు, వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ వెబ్సైట్తో పాటు ‘టైగర్ బుక్ ఆఫ్ ఏటీఆర్’ పేరిట పుస్తకాలను ముద్రించారు. శుక్రవారం వెబ్సైట్తోపాటు పుస్తకాలు, సఫారీ వాహనాలు, కాటేజీలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సారి ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్’ పేరిట పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న చెంచు గైడ్స్కు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు అమ్రాబాద్ డీఎఫ్వో రోహిత్ గొప్పిడి తెలిపారు. నిరుడు టైగర్ సఫారీని మొదలుపెట్టినప్పుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయని, ఇప్పు డు పులుల సంఖ్య గణనీయంగా పెరిగినందున సైటింగ్స్ మరింత పెరగవచ్చని చెప్పారు.