హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) :/ భద్రాచలం, ఏప్రిల్ 16: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను రామాలయం నుంచి ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చి వైకుంఠద్వారం వద్ద శ్రీరామచంద్రమూర్తిని, ఆయనకు అభిముఖంగా సీతమ్మను ఉంచారు.
రామయ్య వైపు ఉప ప్రధానార్చకుడు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, సీతమ్మ వైపు ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సీతమ్మ, రామయ్య గుణగణాలను వర్ణించిన తర్వాత మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ అర్చకులు మాలా పరివర్తన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
సీతారాముల కల్యాణాన్ని వీక్షిస్తే ఆ ఇంట సకల శుభాలు కలుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా అర్చకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా దేవాదాయశాఖ మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులు ఎవరూ ఉత్సవాలకు రాలేదు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి దంపతులు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు.
రాములోరి కల్యాణం లైవ్కు గ్రీన్సిగ్నల్
భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేకుండా ఉండాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. రాములోరి కల్యాణమహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ మొదట నిరాకరించింది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలు, అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల కమిషన్ను కోరారు.