ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
హన్మకొండ, జూలై 18: రాజకీయాల్లో ఆశపడటం సహజమే. కానీ, ముఖ్యమంత్రి పదవిపై ఈటల రాజేందర్ అత్యాశపడ్డారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపుర్ మండల దళిత నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. రాజకీయం గా ఈటలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాలను ఈటల తన స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉండీ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడంతోపాటు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎంతో సహనం పాటించి ఈటల చర్యలను ఓపిగ్గా భరించారని గుర్తుచేశారు. చివరికి టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే చర్యలకు ఈటల పాల్పడుతుండటంతో తదుపరి పరిణామాలు తప్పలేదని పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కించే ఈటల వంటి నాయకుల చర్యలు ఎవరూ భరించలేరని స్పష్టంచేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఈటల రాజేందర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని వినోద్కుమార్ పేర్కొన్నారు.