సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశ్చర్ల సత్యనారాయణ’ పేరిట తీసిన డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్ కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్కు అధికారికంగా ఎంపికైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చిలుకూరి సుశీల్రావు ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. వచ్చే నెల 6న అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు.
వాతావరణ మార్పులు, వాటి పర్యవసానాలపై దృష్టిసారించి పర్యావరణం, అడవుల పరిరక్షణకు దుశ్చర్ల సత్యనారాయణ చేస్తున్న కృషి అంతర్జాతీయ వేదికలపై వెలుగు చూడటం అభినందనీయం. సూర్యాపేటకు సమీపంలోని రాఘవాపురంలో తన పూర్వీకుల నుంచి వచ్చిన 70 ఎకరాల భూమిలో ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ అడవిని సృష్టించారు. ఆరు దశాబ్దాల క్రితమే అడవిని అభివృద్ధి చేయడం ఆరంభించి సంరక్షిస్తున్నారు.
గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో డాక్యుమెంటరీ స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా దుశ్చర్ల సత్యనారాయణ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా భూతాపం పెరిగిపోతున్నదని, 2030 నాటికి ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఐక్యరాజ్యసమితిలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అందుకు చెట్ల నరికివేతను ఆపడం, మొక్క లు పెంచడడంతోపాటు భూతాపం తగ్గేందుకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారని చెప్పారు.
అడవులు పచ్చగా పెరిగితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, తన 70 ఎకరాల్లో అడవిని సృష్టించడం ద్వారా ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తాను సృష్టించిన ఈ అడవిపై చిలుకూరి సుశీల్రావు తీసిన డాక్యుమెంటరీకి గతంలో తెలంగాణ స్టేట్ ఫిలింఫేర్ అవార్డుల్లో ఫస్ట్ ప్రైజ్ దక్కిందని, నేడు కేన్స్ ఫిలింఫేర్కు ఎంపికకావడం ఎంతో సంతోషంగా ఉన్నదని దుశ్చర్ల సత్యనారాయణ పేర్కొన్నారు.