దుబ్బాక టౌన్, నవంబర్ 11: బీజేపీకి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్రావు స్వగ్రామానికి చెందిన అరిగె కృష్ణ టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సమక్షంలో అరిగె కృష్ణ టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. కృష్ణకు హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మాటలు తప్ప చేతలకు పనికి రారని అరిగె కృష్ణ పేర్కొన్నారు. రెండేండ్లలో ఏపాటి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రఘునందన్ అందరినీ విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. హామీల విషయమై ఎమ్మెల్యేను అడిగితే ఎన్నికల్లో గెలుపు కోసం చాలా అబద్ధాలు చెప్తామని, చెప్పిందల్లా చేస్తే ప్రజలు మర్చిపోతారంటూ ఎమ్మెల్యే సర్దిచెప్పారని అరిగె కృష్ణ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో పాటు కార్యకర్తలను పట్టించుకోకపోవడం చాలా బాధకు గురి చేసిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితోనే ప్రజల కష్టాలు తీరుతాయని భావించి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలిపారు.