హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీ రెండేండ్లలో రూ. 200 కోట్లకు పైగా దందా సాగించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాల బడా వ్యాపారులతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. ఈనెల 20న టోనీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ప్రాథమికంగా పలు కీలక విషయాలు సేకరించారు. టోనీ అఫ్రికా దేశాల నుంచి సముద్ర మార్గంలో డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు వెల్లడయ్యింది. ముంబయికి చెందిన వారిని ఏజెంట్లుగా నియమించుకొని డ్రగ్స్ వినియోగించే బడా వ్యాపారుల ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా వారితో టచ్లోకి వెళ్లినట్టు పోలీసులు తెలుసుకొన్నారు. హైదరాబాద్కు చెందిన సుమారు 50 మంది వ్యాపారులు టోనీకి టచ్లో ఉన్నట్టు తెలిసిలింది. కేవలం హైదరాబాద్ వ్యాపారుల నుంచే నెలకు 4 కోట్ల వరకు టోనీకి అర్డర్లు వెళ్లేవని, రెండేండ్లలో రూ.100 కోట్ల వరకు టోనీ సేకరించాడని సమాచారం. టోనీతో సంబంధమున్న ఏడుగురు బడా వ్యాపారులను, వారికి సహకరించిన ఇద్దరు అఫీస్ బాయ్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీతో ఎక్కువ లావాదేవీలు నిర్వహించిన 15 మందిని ప్రాథమికంగా గుర్తించారు. టోనీ డిలీట్ చేసిన వాట్సాప్, ఈ-మెయిల్ చాటింగ్ను హైదరాబాద్ పోలీసులు బయటకు తీయడంతో డ్రగ్స్ దందాతో సంబంధాలున్న వ్యాపారుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కొందరు వ్యాపారులు అజాతంలోకి వెళ్లిపోయారు. టోనీతోపాటు అతనితో సంబంధాలున్న వ్యాపారులను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టును కోరారు. పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యింది. తీర్పు గురువారం వెలువడే అవకాశం ఉంది.