T-NAB | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడుకు రాజశేఖర్గౌడ్ను విచారించగా.. తీగ లాగితే డొంక కదిలినట్టు రాష్ట్రంలో ఆల్ఫ్రాజోలం గుట్టు బయటపడింది. టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా కథనం ప్రకారం.. సుక్క నర్సింహాగౌడ్ గత 25 ఏండ్ల నుంచి యథేచ్చగా అల్ఫ్రాజోలం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రప్పించి కల్లు డిపోలకు విక్రయిస్తున్నాడు. 1995 నుంచి ఇతడు ఢిల్లీ కేంద్రంగా ఈ డ్రగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఢిల్లీలోని భాటియా, అతడి కొడుకు ప్రమోద్సింగ్ నుంచి దీన్ని కొంటున్నాడు. దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మెట్రో కొరియర్ సర్వీస్ ద్వారా రాష్ర్టానికి తరలిస్తూ, హవాలా ద్వారా డబ్బు చెల్లిస్తున్నాడు. కిలో రూ.2.4 లక్షలకు కొని, రూ.3.5 లక్షలకు విక్రయిస్తున్నాడు. విఠల్గౌడ్, అతడి కొడుకు నరేందర్గౌడ్ నుంచీ నర్సింహాగౌడ్.. ఈ మత్తు పదార్ధాన్ని కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో నర్సింహాగౌడ్ కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు టీన్యాబ్ గుర్తించిందని సందీప్ శాండిల్యా తెలిపారు. గచ్చిబౌలిలో రూ.3.5 కోట్ల భవనం, కొండాపూర్లో రూ.5.4కోట్ల విలువైన 3 ప్లాట్లు, కొల్లాపూర్లో రూ.కోటి విలువ చేసే 9 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్టు పేర్కొన్నారు.