హాలియా, ఆగస్టు 30: నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం వాస్తవ్యురాలు డాక్టర్ షేక్ జహీదాబేగానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. తమిళనాడులోని ఈఎస్ఎన్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డు కోసం 1,00,100 పేజీలతో కూడిన అతిపెద్ద గ్రంథాన్ని రూపొందించారు. హైదరాబాద్లోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతిశాస్త్రం అధ్యాపకురాలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వహిస్తున్న షేక్ జహీదాబేగం ఈ గ్రంథానికి ఎడిటర్గా ఉంటూ.. ‘షీ ఫర్ హర్ సెల్ఫ్’ పేరున 200 ఆర్టికల్స్ను రాశారు.
అందుకుగానూ జహీదాబేగానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ మేరకు ఈ నెల 28న చెన్నైలోని హోటల్ తురియాలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ప్రశంసాపత్రం, గిన్నిస్ రికార్డు అఫీషియల్ సర్టిఫికెట్ను అందజేశారు. ఈ విజయం దేశానికే గర్వకారణమని, తెలంగాణ రాష్ట్రం తరఫున అతిపెద్ద రికార్డు అని.. నల్లగొండ జిల్లా హజారిగూడెం పేరును గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించిన డాక్టర్ షేక్ జహీదాబేగంను గ్రామస్థులు, కళాశాల అధ్యాపకులు, రాజకీయ నాయకులు అభినందించారు. ఈ రికార్డును తన తండ్రి దస్తగిరికి అంకితం చేస్తున్నట్టు జహీదాబేగం తెలిపారు.