హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆయుష్ విభాగం చేపట్టిన ‘ఇంటింటికీ ఆయుష్’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 10 గ్రామాలను ఎంపిక చేసి, ఆయుష్ వైద్యవిధానంపై, చికిత్సపై అవగాహన కల్పిస్తున్నారు. మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం ఒక్కో గ్రామానికి 50 మంది డాక్టర్లు, సిబ్బందితో కూడిన బృందాన్ని పంపినట్టు ఆయుష్ విభాగం డైరెక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందస్తుగా గుర్తించి, ప్రాథమిక దశలోనే అరికట్టాలనే లక్ష్యంతో గ్రామస్థులకు స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. మొదటిరోజు 10 గ్రామాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. సుమారు 5 వేల మందికి వైద్యపరీక్షలు జరిపినట్టు తెలిపారు. రెండోరోజు గ్రామస్థులకు జీవనశైలి, వారసత్వంగా వస్తున్న ప్రాకృతిక వైద్యంపై అవగాహన కల్పించామన్నారు. అంగనవాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు యోగా శిబిరాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ 10 గ్రామాల్లో ఇకపై ప్రతినెలా ఒక ఆయుష్ బృందం పర్యటిస్తుందని తెలిపారు.