హనుమకొండ : ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి.. సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. శబరిమల యాత్ర ముగించుకొని వరంగల్ చేరుకున్నారు. అనంతరం హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులోనే హైదరాబాద్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సంతోషాన్నిచ్చిందన్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతోనే ప్రయాణికులకు భద్రత లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని బలోపేతం చేస్తున్నారని, రవాణా సంస్థలు కార్గో సర్వీసులను తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంకా 12 సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించడం ప్రయాణికులకు శుభవార్తేనని.. అవకాశాన్ని వినియోగించుకుంటూ సంస్థను ఆదరించాలన్నారు.