హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లాస్థాయి కార్యకలాపాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు మున్సిపల్శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు మెప్మా కార్యకలాపాలను మున్సిపల్స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, మెప్మా డైరెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మెప్మా కార్యకలాపాలపై ఉన్నతస్థాయి పర్యవేక్షణ అవసరమనే ఉద్దేశంతో అదనపు కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు. ఇందుకోసం అదనపు కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందిని కూడా కేటాయించారు. వీరు డబుల్బెడ్ ఇండ్ల నిర్మాణాలను కూడా పర్యవేక్షిస్తారు. జిల్లా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (డీపీఎంయూ)గా పనిచేస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ మెప్మా కోఆర్డినేటర్ (డీఎంసీ), ఎడీఎంసీ, ఏవో, అకౌంటెట్స్, సీనియర్ అసిస్టెంట్స్, ఇతర సిబ్బంది ఇకపై అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పనిచేస్తున్న సిటీ లెవల్ టెక్నికల్ సెల్ (సీఎల్టీసీ) కూడా అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. వీరికి జిల్లా కలెక్టరేట్లో స్థలాన్ని కేటాయించనున్నారు.