హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ చలాన్లు కట్టుకొనేందుకు ప్రభుత్వం భారీస్థాయిలో రాయితీ కల్పించడంతో వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొదటి రోజే భారీ సంఖ్యలో చలాన్లు చెల్లించారు. నిమిషానికి సగటున 600 మంది చొప్పున చలాన్లు చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు రూ. 600 కోట్ల విలువైన చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. మంగళవారం రాత్రివరకు సుమారు 5.9 లక్షల పెండింగ్ చలాన్లకుగాను వాహనదారులు రూ. 6 కోట్లు చెల్లించారు. ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు ఈ లోక్అదాలత్ ద్వారా భారీ రాయితీలిస్తున్నారనే విషయం గత 10 రోజులుగా ప్రచారంలో ఉన్నది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాయితీ ప్రకటన అమలులోకి వచ్చిన రోజు నుంచి (<https://echallan.tspolice .gov.in) వెబ్సైట్కు భారీ సంఖ్యలో విజిటర్స్ ఉంటారని ఊహించి తగిన ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రమంతా రాయితీ
ట్రాఫిక్ చలాన్లపై కల్పించిన రాయితీకి విశేష స్పందన వస్తుండటంతో ఈ సదుపాయాన్ని రాష్ట్రమంతటికీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు హోం మంత్రి మహమూద్అలీ వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని వాహనదారులందరికీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సదుపాయాన్ని ఈ నెల 31లోగా వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు, తోపుడు బండ్ల వారికి పెండింగ్ చలాన్ మొత్తంలో 25 శాతం చెల్లిస్తే..75 శాతం మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు 30శాతం, కార్లకు, ఇతర వాహనాలకు (లైట్మోటార్ వెహికిల్స్, హెవీ మోటార్ వెహికిల్స్కు) 50 శాతం చెల్లిస్తే చాలని తెలిపారు. మాస్క్లు లేని కేసులలో విధించిన చలాన్లలో రూ.100 చెల్లిస్తే రూ.900 మాఫీ అవుతుందని తెలిపారు. రెండేండ్లలో కరోనాతో పేద, మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ వెసులుబాటు కల్పించినట్టు పేర్కొన్నారు. మార్చి 31 వరకు ఎప్పుడైనా చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని సూచించారు.
నెల రోజుల సమయం ఉంది!
వెబ్సైట్లో వాహదారులు తమ నంబర్ను టైప్ చేసి, ఇంజిన్ చాసిస్ నంబర్ చివరి నాలుగు అంకెలు, క్యాప్చ టైపు చేస్తే వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుస్తుంది. అక్కడే రాయితీ పోను ఎంత చెల్లించాలనే విషయం కూడా ఉంటుంది. ఆన్లైన్లో కూడా చలాన్ చెల్లించుకోవచ్చు. ఈసేవా, మీసేవా, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద ఉన్న కంపౌండ్ బూత్లోను చెల్లించుకునేందుకు అవకాశముంది. మార్చి 31వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.