హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): క్రమశిక్షణ కేసులు పెండింగ్లో ఉన్నా కూడా పలువురికి జోనల్ ఆఫీసర్గా ఉద్యోగోన్నతి కల్పించేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఉద్యోగోన్నతుల ప్రక్రియను పూర్తిగా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని శనివారం ప్రకటన విడుదల చేశాయి. గురుకుల సొసైటీ ప్రమోషన్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా సొసైటీలో ఉన్నతాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి.
జోనల్ ఆఫీసర్ పదోన్నతుల ప్రక్రియను ఇష్టారీతిన చేపడుతున్నారని వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా, క్లియరెన్స్ లేకుండా ఉద్యోగోన్నతులు కల్పిస్తే సొసైటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి.