న్యూఢిల్లీ: 2019 డిసెంబర్లో చైనాలోని వూహాన్లో కరోనా మహమ్మారి వెలుగుచూసింది. అది కొద్దినెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ తప్పనిసరైంది. లాక్డౌన్వల్ల సామాన్య జనం, వలసకూలీలు అవస్థలుపడ్డా కరోనా కట్టడి సాధ్యమైంది. అలాగే, పర్యావరణానికి మేలు జరిగింది. వాతావరణంలో కాలుష్యస్థాయిలు గణనీయంగా తగ్గాయి. కాగా, గతేడాది లాక్డౌన్తో పోల్చితే ఈ ఏడాది లాక్డౌన్ వల్ల కొంతమేరకే కాలుష్యస్థాయిలో తగ్గుదల కనిపించింది. ఈ విషయాన్నిసెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది.
ఢిల్లీకి చెందిన సీఎస్ఈ సంస్థ రెండేళ్లలో విధించిన లాక్డౌన్ల సమయంలో గాలి నాణ్యతను విశ్లేషించింది. అనంతరం కాలుష్యస్థాయిలను పోల్చి, నివేదిక రూపొందించింది. 2021లో విధించిన లాక్డౌన్ 2.5 పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) కాలుష్యస్థాయి 20శాతం తగ్గించగలిగిందని వెల్లడించింది. అయితే, 2020 ఏప్రిల్-మేతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో 2.5 పీఎం కాలుష్య కారకాల సగటు స్థాయి ఎక్కువగా ఉందని తేల్చింది. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే ఈ లాక్డౌన్ విధించిన సంవత్సరాల్లో పర్యావరణానికి మేలు జరిగిందని సీఎస్ఈ వెల్లడించింది.