హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ పరీక్షరాసే విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో డయాబెటిక్ కిట్లు అందుబాటులో ఉంచనున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. చాక్లెట్లు, బిస్కెట్లు, గ్లూకోజ్ వంటి వాటితో కూడిన కిట్ను సెంటర్లలో అందుబాటులో ఉంచుతామని, ఒక టెక్నిషియన్ సైతం ఉంటారని వెల్లడించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్-2026 నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదలకానున్న నేపథ్యంలో ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ నెల 19 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఎప్సెట్ కోసం 16 టెస్ట్ జోన్లుగా విభజించినట్టు వెల్లడించారు. ఈసారి కొత్తగా సిద్దిపేట, గజ్వేల్ను కలిపి జోన్గా ఏర్పాటు చేశామని వివరించారు. గజ్వేల్లోని కావేరి యూనివర్సిటీలో కొత్తగా పరీక్ష కేంద్రం ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. ఇదివరకు నర్సంపేట టెస్ట్ జోన్ ఉండగా దీన్ని వరంగల్ జోన్లో విలీనంచేశామని, నర్సంపేటలో పరీక్ష కేంద్రం ఉంటుందని, టెస్ట్ జోన్మాత్రమే ఉపసంహరించామని తెలిపారు.
ఎప్సెట్కు దరఖాస్తును సులభతరం చేశామని విజయ్కుమార్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కంప్యూటర్, ల్యాప్టాప్ల్లో మాత్రమే దరఖాస్తులు నింపే అవకాశముండగా ఈసారి సెల్ఫోన్లోనూ దరఖాస్తు నింపే వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వెబ్సైట్ రూపకల్పన చేస్తున్నామని వివరించారు. ఈసారి నుంచి పరీక్ష ముగిసిన తర్వాత మార్కులు డిస్ప్లే చేసే కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. పరీక్ష పూర్తైన తర్వాత గణితం, ఫిజిక్స్, రసాయనశాస్త్రం సబ్జెక్టుల్లో విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చిందన్నది కంప్యూటర్పై ప్రత్యక్షమవుతుందని పేర్కొన్నారు. గతంలో ఏ మార్కుకు ఎంత ర్యాంక్ వచ్చిందన్న వివరాలను సైతం వెబ్సైట్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.