Telangana | హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతోపాటు అర్చకులు, అర్చక ఉద్యోగులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతకాలంగా వేతనాలు నిలిచిపోయాయి. దీంతో అర్చకులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని 6,271 ఆలయాల్లో ప్రస్తుతం ధూప, దీప, నేవైద్యం పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద ఒక్కో ఆలయానికి రూ.10 వేలు ప్రభుత్వం అందజేస్తున్నది. ఇందులో రూ.4,000 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు, మిగిలిన రూ.6000 అర్చకుల గౌరవ వేతనంగా నిర్ణయించారు. డీడీఎన్ పథకం కింద తొలుత ఒక్కో ఆలయానికి రూ.2,500 మాత్రమే ఇవ్వగా కేసీఆర్ ప్రభుత్వం రూ.10,000కు పెంచింది.
ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం మూడు-నాలుగు నెలలకోసారి విడుదల చేస్తున్నది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదన పంపడంలో జాప్యం జరిగింది. దీంతో ఎన్నికలకు ముందు నుంచి వేతనాలు నిలిచిపోయాయి. వీరితోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చకులు, అర్చక ఉద్యోగులకు కూడా వేతనాలు అందడంలేదు. దాదాపు 3,500 ఆలయాల్లోని అర్చకులు, అర్చక ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చే కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటికీ, వీరికి ఎన్నికలకు ముందు నుంచి వేతనాలు అందడంలేదు.
వేతనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే డీడీఎన్ నిధులు, అర్చకులకు వేతనాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమ పరిషత్ ద్వారా కేసీఆర్ సర్కారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దాదాపు రూ.230 కోట్లు, ఆలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.3,000 కోట్లు వెచ్చించింది. డీడీఎన్ పథకం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 9,771 ఆలయాల్లో అర్చకులకు వేతనాలు ఇవ్వడంతోపాటు నిత్యం ధూప, దీప, నైవేద్యం కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నది.