హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : నేరాల దర్యాప్తు, పోలీసింగ్లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో ఏడీజీలు, ఐజీలు, సీపీలు, యూనిట్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల సీసీటీఎన్ఎస్పై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఫలితంగా గతంలో 70-80 శాతంగా ఉన్న డాటా అప్డేట్ 96 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ప్రతినెలా నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ను పాటించడాన్ని పోటీగా తీసుకోవాలని అన్నారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్స్పెక్షన్ నోట్స్ను పరిశీలించాలని, జిల్లాల పర్యటనలు, పోలీస్స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో గడిచిన మూడేండ్లలో మొత్తం నేరాల్లో దాదాపు 7.15%, డ్రగ్స్ కేసుల్లో కూడా 46.10% పెరుగుదల కనిపించిందని డీజీపీ తెలిపారు. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58% నుంచి 491.59 శాతానికి పెరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నేరాల్లోనూ 9.48% పెరుగుదల కనిపించిందని చెప్పారు. తీవ్రమైన నేరాల్లో మూడేండ్లలో కలిపి 10.33% తగ్గుదల కనిపించిందని సిబ్బందిని డీజీపీ అభినందించారు. సైబర్, ఆర్థిక నేరాల్లో స్వల్ప ఊరట లభించిందని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా నేరాల్లో నేరాల తీవ్రత తగ్గిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29% తగ్గాయని, ఆర్థిక నేరాల్లోనూ 13.28% తగ్గుదల నమోదైందని వివరించారు. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత, సాధారణ, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేరాలపై లోతైన విశ్లేషణ, నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.
డిజిటల్ పోలీసింగ్ పోర్టళ్లలో సమాచారాన్ని నిర్ణీత గడువులోగా నవీకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కచ్చితమైన సమాచారాన్ని నమోదుచేస్తున్న పోలీసు యూనిట్ల పనితీరును అభినందించారు. ఏఐ ఆధారిత పోలీసింగ్ అప్లికేషన్లు, సీసీటీఎన్ఎస్, టీజీ-కాప్, హాక్ ఐ డిజిటల్ వేదికల పనితీరు, వినియోగంపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. కొత్త నేర చట్టాల (ఎన్సీఎల్) అమలు, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్), సైబర్ నేరాల నియంత్రణ, ఈగల్ కార్యకలాపాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పనితీరు, కేసుల భారంపైనా సమీక్షించారు. పోలీసు శాఖ ఆర్థిక, బడ్జెట్ అంశాలు, పోలీసు గృహ నిర్మాణ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అవసరాలు, కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన అంశాలు, వారి పునరావాస చర్యలను కూడా సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని చెప్పారు. సమీక్షలో డీజీలు మహేశ్ భగవత్, శిఖాగోయెల్, చారుసిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పోలీస్ సర్వీస్ (ఎస్పీఎస్)లో నాన్-క్యాడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందిస్తూ, ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఐపీఎస్ హోదాతో ప్రమోషన్ పొందిన అధికారుల్లో ఆరుగురు డీజీపీ సీవీ ఆనంద్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రవీందర్ పులిగిల్ల, వీ అరవింద్బాబు, బీ రాజామహేంద్ర నాయక్, బీ సాయిశ్రీ, ఐ పూజ, పీ కరుణాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ ప్రమోషన్ పొందిన ఐపీఎస్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఐపీఎస్గా నియామకమైన ఈ అధికారులు ఏడాదిపాటు ప్రొబేషనరీ కాలంలో ఉంటారని, ఈ సమయంలో నిర్దేశించిన శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుందని డీజీపీ కార్యాలయం తెలిపింది.