ఒడిశానుంచి వచ్చిన 150 టన్నుల ప్రాణవాయువు
ఫలించిన సైనిక విమానాల్లో ట్యాంకర్ల తరలింపు
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చేరవేత
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు ప్రాణాధార ఆక్సిజన్ను వేగంగా తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నం ఫలించింది. సైనిక విమానాల్లో ఒడిశాకు తరలించిన 9 ఆక్సిజన్ ట్యాంకర్లు 150 టన్నుల ఆక్సిజన్తో సోమవారం రాష్ర్టానికి చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో ఈ నెల 23న 9 ట్యాంకర్లను తెలంగాణ ప్రభుత్వం సైనిక విమానాల సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసింది. ఒడిశాలోని అంగూల్, రూర్కెలాకు తరలించింది. దీంతో ఒడిశాకు రోడ్డుమార్గంలో వెళ్లేందుకు పట్టే రెండు రోజుల సమయం ఆదా అయింది. ఆక్సిజన్ను నింపుకుని రోడ్డుమార్గంలో బయలుదేరిన ట్యాంకర్లు సోమవారం రాష్ర్టానికి చేరుకున్నాయి. వాటిని హైదరాబాద్లోని టిమ్స్, కింగ్ కోఠి, చెస్ట్ దవాఖానలు, చర్లపల్లితోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు తరలించారు. సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఈ ఆక్సిజన్ ప్రాణాధారంగా నిలువనున్నది.