నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఆదరించి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు 12 చోట్ల గెలిపించిన నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టుకొంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఎన్నిక ప్రచార సభలో చెప్పిన విధంగా మునుగోడుతోపాటు నల్లగొండ జిల్లాకు అన్ని రకాలుగా అండగా ఉండడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే తామంతా జిల్లాలో అభివృద్ధి పథకాలపై ప్రత్యేక సమీక్షకు వచ్చినట్టు వెల్లడించారు.
గురువారం మునుగోడులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే 12 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురంలో 542 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుచేసి, 579 కంపెనీలకు స్థలం ఇచ్చి వేలమందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే ఇక్కడి వచ్చి అభివృద్ధి పథకాలపై రివ్యూ చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. రాబోయే ఏడాది కాలానికి కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా తీసుకొని పూర్తి చేయాల్సిన పనులపై స్పష్టమైన కార్యచరణ రూపొందించినట్టు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు ఏ నర్సిరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి 31 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో పది పాయింట్లతో అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యంలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు 26 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయని తెలిపారు.