హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఏడాదిలోపు పిల్లలు ఏడిస్తే కారణమేంటో తెలుసుకోవటం చాలా కష్టం. ఈ సమస్యకు బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు. తల్లుల బాధలను పరిష్కరించేందుకు బీటెక్ విద్యార్థులు భువిక, నిధి వేణుగోపాల్ నాయర్, మోనిష, స్వాతి ‘ఇన్ఫాంట్ క్రై డిటెక్టర్’ను రూపొందించారు. ఈ పరికరం పిల్లల ఏడుపును పసిగట్టి కారణాన్ని చెప్తుంది. అదెలాగంటే.. విద్యార్థులు కొంతమంది పిల్లల ఏడుపులను రికార్డు చేశారు. ఆకలైతే, నొప్పిగా ఉంటే, నిద్రభంగమైతే, ఇన్ఫెక్షన్లు వంటి వాటికి ఎలా ఏడుస్తుంటారో తెలుసుకొని ఆ వాయిస్లను వాయిస్ రికార్డర్లో నిక్షిప్తం చేశారు.
పనిచేస్తుందిలా..సెన్సర్లు, వాయిస్ రికార్డర్, యాప్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పరికరాన్ని తయారుచేశారు. ఈ యాప్లో రికార్డయిన శబ్దాలను బట్టి.. ఎవరైనా పిల్లలు ఏడవగానే యాప్లోని సెన్సర్లు గ్రహించి, కారణాన్ని ఆడియో రూపంలో చెప్తాయి. ఈ పరికరం డాక్టర్లు, తల్లులు, కేర్టేకర్లకు ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ పరికరం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకొన్నది. ఈ ప్రాజెక్ట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇన్నోవేషన్ సెల్.. ఆ విద్యార్థులకు నగదు బహుమతిని కూడా అందజేసింది.