చింతకాని, ఆగస్టు 30 : ఖమ్మం జిల్లా చింతకానిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారకు నిరసన సెగ తగిలింది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ‘దళితులకు మూడెకరాల భూమి’ పథకం కింద రాజకీయాలకతీతంగా చింతకాని గ్రామంలోని దళితకాలనీకి చెందిన 20 మంది లబ్ధిదారులను గుర్తించి తొమ్మిది మందికి భూపంపిణీ చేశారు. ఆ సమయంలో భూములు అమ్మేందుకు రైతులు ముందుకురాకపోవడంతో ఇంకా 11 మందికి భూపంపిణీ నిలిచిపోయింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మిగిలిన 11 మందికి మూడెకరాల చొప్పున భూమిని కేటాయించాలని దళిత మహిళలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గతంలో 9మంది లబ్ధిదారులకు కేటాయించిన ఆ భూమినైనా 20 మందికి సమానంగా పంచాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. ఈ ఘటనతో చింతకానిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. భట్టి ఆందోళనకారులను కలువకుండానే వెళ్లిపోయారు.