Dalith March | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దళితులపై దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న చలో ఢిల్లీ పేరిట పార్లమెంట్ దళిత మార్చ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ దళిత సమ్మిట్లో పాల్గొన్న దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. జాతీయ దళిత సమ్మిట్-2023 హైదరాబాద్ వేదికగా రెండురోజుల పాటు కొనసాగింది. చివరిరోజు ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి యూజీసీ మాజీ చైర్మన్, జేఎన్యూ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దళితుల విముక్తి కోసం విద్య ప్రాముఖ్యతను వివరించారు. దళితులు, ఇతర వెనకబడిన కులాల ద్వారా కులం, అంటరానితనానికి వ్యతిరేకంగా పౌరహకుల ఉద్యమం ఎలా అవసరమో విశదీకరించారు. అయినప్పటికీ అంటరానితనం, కుల నిర్మూలనకు ఆధిపత్య కులాలు చొరవ తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. దళితుల అసమానత నిర్మూలనకు, అభ్యున్నతికి ఉపకార వేతనాల ద్వారా ప్రభుత్వం విద్యకు మద్దతు ఇవ్వడం చాలా అవసరమని, వివక్షకు వ్యతిరేకంగా చట్టం, కులం, అంటరానితనం సమస్యలపై ప్రజలను చైతన్యం చేసే చర్యలు ఉండాలని సూచించారు. డిసెంబర్ 4న దళితుల మార్చ్ టు ఢిల్లీ నిర్వహించాలని సదస్సులో పాల్గొన్న దళిత సంఘాలు నిర్ణయించాయి.
మార్చ్పై ప్రచారానికి నాయకత్వం వహించే 10 మంది సభ్యుల కమిటీని కూడా ఎన్నుకున్నారు. దళితుల ఎజెండా-2024 కమిటీలో మల్లేపల్లి లక్ష్మయ్య, రామచంద్ర డోమ్, నిర్మల్, ధీరేంద్ర ఝౌ, గుల్జార్ సింగ్ గోరియా, విక్రమ్ సింగ్, కర్నెల్ సింగ్, బీనా పల్లికల్, సాయిబాలాజీ, బీ వెంకట్ ఉన్నారు. కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి సమర్పించాలని, తర్వాత డిసెంబర్ 4న పార్లమెంటుకు దళిత్ మార్చ్ నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. జాతీయ దళిత సమ్మిట్-2023 ద్వారా హైదరాబాద్లో కలిసి వచ్చిన సంఘాలు కుల నిర్మూలన, దళితులకు న్యాయం జరిగేలా విప్లవాత్మక స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చింది. దళిత ఎజెండా ఏర్పాటు చేయడానికి కార్పొరేట్, మతతత్వ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి కృషి చేయాలని కమిటీ కోరింది. మణిపూర్ ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడంలో కేంద్రం, ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఖండిస్తూ సమ్మిట్ తీర్మానించింది. శిఖరాగ్ర సమావేశం ప్రజాకవి గద్దర్ను స్మరించుకొని సంతాపం తెలిపింది. దళిత హకుల ఉద్యమం కోసం కో-ఆర్డినేషన్ బాడీని నియమించింది. సదస్సులో యూపీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు సుభాషిణితోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.