హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): వచ్చే జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మరే ఇతర కులాల జనాభాను లెక్కించబోమంటూ ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను నిరసిస్తూ బీసీ సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. ఢిల్లీలో జరిగిన ఈ నిరసనలో తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కులాలవారీగా జనగణన చేయాలి
దేశంలో వెంటనే కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్ను ముట్టడిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని పార్టీలు బీసీల గణన విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బీసీల జనగణన కోసం అన్ని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతల్ని కలిసి మద్దతు కూడగడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కుమ్మర క్రాంతి కుమార్, కనకాల శ్యామ్కుర్మా, రాచాల యుగేందర్గౌడ్, కులచర్ల శ్రీనివాస్ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, శేఖర్ సగర, రావులకొల్ నరేశ్, ఈడిగ శ్రీనివాస్గౌడ్, పీ రంగనాథ్, పానుగంటి విజయ్, మూర్తి, సాయితేజ, సతీశ్, సత్యం సగర తదితరులు పాల్గొన్నారు.